Corona: చేయి దాటిపోయింది.. మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు..

  • Published On : April 20, 2021 / 07:25 AM IST

Corona Positive Cases Rising Again In India

Covid-19: బ్రేక్‌ ది చైన్‌ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ కరోనా తీవ్రతను అదుపులోకి తెచ్చినట్లుగా కనిపించట్లేదు.. ప్రస్తుతం కరోనా ఆ రాష్ట్రంలో చేయి దాటిపోయింది. ఇక లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రాలో రోజుకు 68,531 కొత్త కేసులు నమోదవ్వడం ఇప్పుడు ఆందోళనకు కారణం అవుతోంది.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతంగా మహారాష్ట్ర రికార్డులకు ఎక్కగా.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోవడం జరుగుతుంది. గంటకు మూడు వేల మందికి కరోనా సోకుతుంది. మహారాష్ట్రలో కరోనా కారణంగా చనిపోయినవారి శాతం 1.58గా ఉంది. 90 శాతానికిపైగా ఉండే రికవరీ రేట్‌ 80.92 శాతానికి పడిపోయింది.

దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సహాయ, పునరావస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు.