ఉగ్ర సంస్థలకు వేల కోట్లు ఇచ్చాం..పాక్ మంత్రి సంచలన కామెంట్స్

నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్‌-ఉద్‌-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పాకిస్తాన్‌ మంత్రి  ఇజాజ్‌ అహ్మద్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ చానెల్ లో నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇమ్రాన్‌ఖాన్‌ పాలన తమ దేశాన్ని నాశనం చేస్తోందని, పాక్‌ను పాలిస్తున్న నేతల తీరుతో దేశం భ్రష్టు పడుతోందని అహ్మద్‌షా విమర్శించారు.

సెప్టెంబర్‌ 10న జెనీవాలో జరిగిన 42వ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్‌ (యుఎన్‌హెచ్‌ఆర్‌సి) సమావేశంలో ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను భూమి మీదే అతిపెద్ద జైలుగా మార్చేశారని  పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి  వ్యాఖ్యానించడమే ఇమ్రాన్‌ పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చని అహ్మద్‌ షా తెలిపారు. ఈ ఏడాది జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారని.. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడారని అహ్మద్ షా తెలిపారు.