Parliament Budget Sessions : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఎన్డీఏ పక్ష నేతలతోపాటు అఖిలపక్ష నాయకులతో కేంద్ర ప్రభుత్వం విడి విడిగా సమావేశం కానుంది. సోమవారం పార్లమెంట్ లో అఖిలపక్ష నాయకులతో కేంద్రం సమావేశం కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాల్సిందిగా పార్లమెంటరీ పక్ష నేతలను కేంద్రం కోరనుంది. ఎల్లుండి ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది.
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ముకు పార్లమెంట్ లో ఇదే మొదటి ప్రసంగం. ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు. ఈ నెల 31న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి1న లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత సమావేశాలు కాగా, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 66 రోజుల్లో 27 సిట్టింగుల్లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం, కేంద్ర బడ్జెట్, కీలక బిల్లుల ఆమోదంపై పార్లమెంట్ లో చర్చలు జరుగనున్నాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ ఆమోదంపై జరిగే చర్చలో పాల్గొని సభ్యుల సందేహాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.