Parliament monsoon session – Manipur: మణిపూర్లో హింసాత్మక ఘటనలపై పార్లమెంట్లో తొలిరోజు కేంద్ర సర్కారుని విపక్ష పార్టీలు నిలదీసే ప్రయత్నాలు చేశాయి. లోక్సభ(Lok Sabha), రాజ్యసభ(Rajya Sabha)ను ఈ అంశమే కుదిపేసింది. ఇతర కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసి మణిపూర్ హింసపైనే చర్చించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సభకు వచ్చి సమాధానం చెప్పాలన్నాయి.
తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభల్లో చర్చ ముందుకు వెళ్లలేదు. రాజ్యసభను ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ మొదట మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్సభలోనూ ఎలాంటి చర్చ లేకుండానే శుక్రవారానికి వాయిదా పడింది.
ఉభయ సభల్లో మొత్తం 37 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 8 బిల్లులపై చర్చించి ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ చాలా కాలంగా తీసుకురావాలనుకుంటున్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, జనగణనపై కొత్తబిల్లు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాలు మొత్తం విపక్షాలు ఆందోళనలతో హోరెత్తించే అవకాశం ఉంది.
సభ సజావుగా నడవకూడదని విపక్ష పార్టీలు భావిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ అన్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సున్నిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీరు ఇదేనా అని నిలదీశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షం మాత్రం సభ జరగకుండా అడ్డుకుంటోందని పలువురు బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు.