Lok sabha : లోక్సభలో భద్రతా వైఫల్యం.. సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఉలిక్కిపడ్డ ఎంపీలు
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. ఓ ఆగంతకుడు స్పీకర్ వైపుకు దూసుకెళ్లారు.
- Harish Thanniru
- Updated on- December 13, 2023 / 02:20 PM IST
Lok Sabha
Parliament : పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. అందులో ఒకరు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. హఠాత్తుగా జరిగిన ఘటనతో ఎంపీలు ఉలిక్కిపడ్డారు. కొందరు భయంతో బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఇద్దరు అగంతకులను అదుపులోకి తీసున్నారు. వారి వద్ద నుంచి టియర్ గ్యాస్ సెల్స్ ను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. జీరో అవర్ లో బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే, గందరగోళం తొలగిన కొద్దిసేపటికే లోక్ సభ మళ్లీ పున: ప్రారంభమైంది. ఇదిలాఉంటే.. 22ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం తీవ్ర కలకలం రేపింది.
Also Read : Tollywood : డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీని హెచ్చరించిన హైదరాబాద్ కొత్త సీపీ..
లోక్ సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్ సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో భద్రతా ఏర్పాట్లను ఉల్లంఘిస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి దూకారు. వారు టియర్ గ్యాస్ ఉపయోగించడంతో సభలో పొగ కమ్ముకుంది. ఇద్దరులో ఒక వ్యక్తి స్పీకర్ పోడియం వైపుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మరింత గందరగోళ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాలరీ నుంచి దూకి టియర్ గ్యాస్ వదిలిన ఇద్దరిలో ఒకరు మహిళకూడా ఉన్నారు. వ్యక్తి పేరు అమోల్ షిండే, మహిళ పేరు నీలంగా భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీస్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఎంపీలు మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి పసుపు రంగు గ్యాస్ ను వదిలారని అన్నారు. వెంటనే కొందరు ఎంపీలు వారిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని అన్నారు.
లోక్ సభలో గందరగోళంపై స్పీకర్ స్పందించారు.. ఆగంతకులను అరెస్ట్ చేశారని, పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత దీనిపై వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. విపక్ష ఎంపీలు మాత్రం భద్రతా వ్యవసస్థ పై సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో జరిగిన గందరగోళం పై తన కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో మాట్లాడతానని స్పీకర్ చెప్పారు.
