Patna’s Oxygen Man : ఆక్సిజన్ మ్యాన్, వందల మంది ప్రాణాలను రక్షిస్తున్నాడు

ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.

Corona Patients Oxygen Cylinders : కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజలను చంపేస్తోంది. కళ్ల ముందే..తమ వాళ్లు విగతజీవులుగా మారుతుండడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రధానంగా ఆక్సిజన్ అందక అత్యధిక మంది మరణిస్తున్నారు. ఆక్సిజన్ కొరత దీనికి ప్రధాన కారణంగా ఉంది. తోటి మనిషికి సహాయం చేయడం మరిచిపోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే..ఓ వ్యక్తి మాత్రం తనకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాడు.

ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్. ఆక్సిజన్ అందకపోవడంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో స్వయంగా అతను కళ్ల చూశాడు. దీంతో..ఇతరులకు ఇబ్బంది కలుగకూడదని..ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాడు.

గత సంవత్సరం కరోనా ఎలాంటి పరిస్థితి సృష్టించిందో అందరికీ తెలిసిందే. గౌరవ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే..ఆసుపత్రిలో అడ్మిట్ కావడానికి బెడ్ దొరకలేదు. దీంతో ఓ వార్డులో మెట్ల పక్కనే ఉండిపోయాడు. అక్కడే తిండి..నిద్ర. కానీ..అతనికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. గౌరవ్ భార్య నానా అవస్థలు పడి..ఓ ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేశారు. గౌరవ్ నెమ్మదిగా కోలుకుని వైరస్ బారి నుంచి బయటపడ్డాడు. సిలిండర్ దొరక్క పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశాడు. ఆరోగ్యవంతంగా అయిన తర్వాత..ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు గౌరవ్ దంపతులు.

సొంత డబ్బులతో ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. తన దగ్గరున్న వ్యాగ్నర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని..అవసరం ఉన్న వారికి అందచేయడం ప్రారంభించారు. ఇతనికి స్నేహితులు జత కలిశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఆక్సిజన్ గురంచి ప్రచారం చేశారు. సిలిండర్ అవసరం ఉన్న వారు గౌరవ్ కు ఫోన్ చేసేవారు. సిలిండర్లను ఉచితంగా ఇచ్చి..ఆ పేషెంట్ కోలుకున్నాక..మరలా ఆ సిలిండర్ ను వెనక్కి తీసుకొచ్చేవారు. ఇలా..చేస్తున్నా..గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం మెచ్చుకోవాల్సిన అంశం.

ప్రారంభంలో…పది సిలిండర్లతో ప్రారంభమై..నేడు..200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది..గౌరవ్ ను మెచ్చుకున్నారు. అంతేకాదు..తమకు తోచిన విధంగా విరాళాల రూపంలో గౌరవ్ కు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తుండడంతో గౌరవ్ కు కాల్ సంఖ్య మరింతగా పెరిగిపోయాయి. దీంతో అతను ఉదయం 5 గంటలకే నిద్ర లేచి..అవసరమైన వారికి గ్యాస్ సిలిండర్లను అందచేస్తున్నారు. ఇలా అర్థరాత్రి వరకు సేవ చేస్తున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారికి ఇప్పటి వరకు దాదాపు 950 మందికి సిలిండర్లను సరఫరా చేసినట్లు సమాచారం. ఇతను చేస్తున్న సేవలను మెచ్చుకుంటూ..‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుచుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు