Aklesh Yadav : ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(SP)చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని ఇప్పటికే వేగవంతం చేసిన అఖిలేష్ యాదవ్ సోమవారం ఇటావాలో పర్యటించారు.
ఈ సందర్భంగా మోదీ వారణాశి పర్యటనపై అఖిలేష్ ను విలేకరులు ప్రశ్నించగా…ఇది చాలా మంచిది. ఒక నెల కాదు… మూడు నెలలైనా వారణాసిలోనే ఉండవచ్చు. అలా ఉండడానికి కూడా పూర్తి అర్హత గల ప్రదేశం. అయితే ప్రజలు తమ చివరి రోజుల్లో వారణాసిలోనే గడుపుతారు” అని అఖిలేశ్ సమాధానమిచ్చారు. అయితే దాని తర్వాత ఈ వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్ అన్న అర్థంలోనే ఈ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అబద్దాలు చెబుతుందని, కానీ దేవుడి దగ్గర మాత్రం అలా కుదరదని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
వేగం లేని బీజేపీ అభివృద్ధి పనుల వల్లే ఇటావాలోని క్రికెట్ స్టేడియం ఐపిఎల్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోల్పోయిందని అఖిలేష్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అధికార యంత్రాంగం ఇటావాపై వివక్ష చూపిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
కాగా, ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం వారణాశి చేరుకున్న విషయం తెలిసిందే. తొలి రోజు వారణాశి పర్యటనలో.. చారిత్రక కాశీ విశ్వనాథ దేవాలయం వద్ద ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్ సమీపంలో రూ.339 కోట్ల వ్యయంతో నిర్మించిన కాశీ కారిడార్ తొలి ఫేజ్ను మోదీ ప్రారంభించారు. అంతకుముందు గంగానదిలో పుణ్యస్నానం ఆచరించి..కాశీ విశ్వనాథుకి ప్రత్యేక పూజలు చేశారు మోదీ. కాగా,వారం రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్ లో మోదీ ప్రారంభించిన మూడో ప్రాజెక్టు ఇది.
సందర్శకులకు అనేక సౌకర్యాలను అందించే కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ మొదటి దశలో మొత్తం 23 భవనాలను మోదీ ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, భోగశాల,సిటీ మ్యూజియం, వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.
కాశీ అవినాశిని అని, ఇక్కడ ఒకటే సర్కార్ ఉంటుందని, ఎవరి చేతుల్లో ఢమరుకం ఉంటుందో, వారి సర్కారే ఇక్కడ నడుస్తుందని మోదీ ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.
ALSO READ Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని