PM Modi రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు. వరుస డ్రోన్ దాడులతో జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్న వేళ.. ప్రధాని నివాసంలో జరిగిన ఈ హై లెవల్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
భద్రతా దళాలకు అధునాతన రక్షణ పరికరాల అందజేత, నూతన నియామకాల ద్వారా సైన్యం పెంపు, రక్షణ రంగంలో అంకుర పరిశ్రమల స్థాపన, భవిష్యత్ వ్యూహాల గురించి, జమ్ముకశ్మీర్లో డ్రోన్ దాడుల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జమ్మూ డ్రోన్ దాడిపై మోడీ సీరియస్ అయినట్లు సమాచారం. ఉగ్రవాదానికి ధీటైన సమాధానం ఇవ్వాలని.. జమ్మూకాశ్మీర్ లో శాంతి యుత పరిస్థితులకు విఘాతం కలగకుండా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు సమాచారం. పీఓకే లో ఉగ్ర స్థావరాలు,ఉగ్రవాద కదలికలపై కూడా దృష్టి సారించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలుస్తోంది.
కాగా, జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. సరిహద్దు అవతల పాకిస్థాన్ నుంచే డ్రోన్లు వచ్చినట్లు…నిఘా వర్గాలు అంచనాకు వచ్చిన వేళ జమ్ముకశ్మీర్లో హైఅలర్ట్ ప్రకటించారు.