దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థల పాత్రపై పాడ్కాస్ట్లో మోదీ ఏమన్నారంటే..?
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Harishth Thanniru
- Published On : March 17, 2025 / 02:23 PM IST
PM Modi
PM Modi: అమెరికన్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ పాడ్ కాస్ట్ లో జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానాలిచ్చారు. యుక్రెయిన్, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు, అమెరికా – చైనా మధ్య ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల పాత్రపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
సృష్టించబడిన అంతర్జాతీయ సంస్థలు దాదాపు పరస్పరం సంబంధం లేకుండా ఉన్నాయి. వాటిలో సంస్కరణలు లేవు. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు తమ పాత్రను పోషించలేకపోతున్నాయి. ప్రపంచంలోని చట్టాలు, నియమాలను పట్టించుకోని వారు అన్ని చేస్తున్నారు, అలాంటి వారిని ఎవరూ ఆపలేకపోతున్నారని ప్రధానమంత్రి అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ప్రతిదేశం యొక్క పరిస్థితులను బహిర్గతం చేసింది. మనం ఎంత గొప్ప దేశంగా భావించినా.. చాలా ప్రగతిశీలంగా, చాలా శాస్త్రీయంగా అభివృద్ధి చెందామని భావించినా, అది ఏదైనా కావచ్చు, ప్రతి దేశం తమదైన రీతిలో కోవిడ్-19 కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రపంచంలోని ప్రతిదేశం కొవిడ్ మహమ్మారి నుంచి ఏదో నేర్చుకుంటుందని, మనం కొత్త ప్రపంచ క్రమంవైపు పయనిస్తామని అనిపించింది. కానీ, దురదృష్టవశాత్తు ప్రపంచం శాంతి వైపు వెళ్లే బదులు విచ్ఛిన్నంవైపు పయణిస్తుంది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేసిందని ప్రధాని మోదీ అన్నారు.
నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా.. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. ప్రతిఒక్కరికీ అందరూ అవసరం, ఎవరూ ఒంటరిగా ఏమీ చేయలేరు. నేను వెళ్తున్న అన్ని వేదికల్లో ప్రతిఒక్కరూ ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణల గురించి ఆందోళన చెందుతున్నారని నేను చూస్తున్నాను. దాని నుండి అతి త్వరలో ఉపశమనం పొందాలని మేము ఆశిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
