PM Ujjwala Yojana : గ్యాస్ వినియోగదారులకు మరో బిగ్షాక్.. ఇకపై తొమ్మిది కాదు.. కేవలం నాలుగు మాత్రమే..
PM Ujjwala Yojana : ఉజ్వల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను తగ్గించింది.
- Harish Thanniru
- Published on- June 9, 2026 / 07:45 AM IST
PM Ujjwala Yojana subsidised LPG cylinder
- పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు షాక్
- ఇకపై రాయితీ సిలిండర్లు ఏడాదికి నాలుగే
- ఏడాదికి రూ.1200 సబ్సిడీ మాత్రమే
PM Ujjwala Yojana : ఉజ్వల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి కేవలం 4కి తగ్గించింది. ఒక్కో సిలిండర్పై రూ.300 సబ్సిడీ కొనసాగినా.. ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే వర్తిస్తుంది. దీంతో లబ్ధిదారులకు ఏడాదికి కేవలం రూ.1200 మాత్రమే సబ్సిడీ లభించనుంది.
నిరుపేద గృహిణులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభంలో లబ్ధిదారులకు 14.2 కిలోల బరువున్న 12సిలిండర్ల వరకూ రాయితీపై సరఫరా చేసేది. గతేడాది వీటి సంఖ్య తొమ్మిదికి కుదించింది. ప్రస్తుతం కేవలం నాలుగు సిలిండర్లకు పరిమితం చేసింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని రాయితీ సిలిండర్లను నాలుగుకు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీన్ మాల్ ఖనూజా తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ కు రూ.924 చెల్లిస్తున్నారు. పీఎంయూవై లబ్ధిదారులకు రూ.300 చొప్పున సబ్సిడీ ఇస్తుండటంతో వారికి నికరంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.642 మాత్రమే పడుతోంది. ఇకనుంచి ఏడాదికి నాలుగు సిలిండర్లే ఇస్తుండటంతో.. ఏడాది కోటా దాటితే వారుసైతం పూర్తి ధర రూ.942 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయంగా ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఫిబ్రవరి నుండి 46శాతం పెరగడంతో ఒక సిలిండర్ సరఫరా ఖర్చు ప్రభుత్వానికి రూ.1600 దాటుతోంది. దీనివల్ల చమురు సంస్థలు ప్రతి సిలిండర్పై రూ.700 నష్టపోతున్నాయి. ఈ నష్టాలను తట్టుకోవడానికే లబ్ధిదారులకు ఏడాదికి కేవలం మొదటి నాలుగు సిలిండర్లపై మాత్రమే రూ.300 చొప్పున (మొత్తం రూ.1200) రాయితీ ఇచ్చేలా నిర్ణయించారు.
