Mohan Bhagwat: అధికారం అందుకే, మతంలో చెప్పిందీ అదే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
బలహీనులను క్రూరమైన వారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్న చోట, అవసరాన్ని బట్టి బలవంతపు ప్రయోగాలకి సిద్ధంగా ఉండాలని సూచించారు. బలహీనులను రక్షించాలనుకుంటే, అలా తప్పక వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
- tony bekkal
- Published On : October 16, 2023 / 08:03 AM IST
Mohan Bhagwat: పేదలకు సహాయం చేయడానికి డబ్బులు విరాళంగా ఇస్తారని, అలాగే బలహీనులకు సహాయం చేయడానికి అధికారం ఉపయోగపడుతుందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆదివారం (చివరి రోజు) కథువా చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజానికి హాని కలిగించాలనుకునే వారితో దేశం కఠినంగా వ్యవహరించక తప్పదని సంఘ్ వాలంటీర్లతో అన్నారు. అహింస, కరుణ, సమయానుగుణంగా కఠినంగా ఉండడం వంటి ప్రాముఖ్యతతను ఆయన నొక్కి చెప్పారు.
‘‘సమాజానికి దేశానికి హాని కలిగించే లేదా విచ్ఛిన్నం చేయాలనుకునే వారితో వ్యవహరించడానికి అవసరమైన పద్ధతిని అవలంబించాలి. పేదలను ఆదుకునేందుకు ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లే, బలహీనులను రక్షించేందుకు అధికారాన్ని ఉపయోగించాలి. సమాజం, దేశం కోసం ఈ భావాన్ని ప్రతి ఒక్కరి మనస్సులో నాటాలి. ఇవి మన మతంలోని విలువలు. అందులో ఎలాంటి సందేహం లేదు” అని మోహన్ భగవత్ అన్నారు.
బలహీనులను క్రూరమైన వారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్న చోట, అవసరాన్ని బట్టి బలవంతపు ప్రయోగాలకి సిద్ధంగా ఉండాలని సూచించారు. బలహీనులను రక్షించాలనుకుంటే, అలా తప్పక వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. తమ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయని, అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భద్రతను, బాధ్యతను సమంగా చూసుకోవాలని చెప్పారు. కథువా చౌక్లో జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించిన మోహన్ భగవత్.. ఆలయంలో ప్రార్థనలు చేశారు.
