Abhijit Mukherjee దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారడు,మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అభిజిత్ ముఖర్జీ స్పందించారు. తాను టీఎంసీలో చేరనున్నట్టు వచ్చిన వార్తలను శుక్రవారం అభిజిత్ ముఖర్జీ తోసిపుచ్చారు.
తన స్నేహితుడు జితిన్ ప్రసాదలా తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని అభిజిత్ ముఖర్జీ స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎంసీలో ఉన్న తన తండ్రి సహచరులే ఇలాంటి వదంతులకు కారణమని అభిజిత్ ముఖర్జీ తెలిపారు. తాను టీఎంసీ భవన్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని శుక్రవారం సాయంత్రానికి కోల్ కతా చేరుకుని టీఎంసీలో చేరతానని వస్తున్న వార్తలు సత్యదూరమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, టీఎంసీ లేదా ఇతర పార్టీలో చేరతాననే ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు.
కాగా,గతంలో ఎంపీగా పనిచేసిన అభిజిత్ ముఖర్జీ..ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు.