Prashant Kishor : ఉప ఎన్నికల్లో విజయం తరువాత ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్.. బీజేపీ అధిష్టానంకు హెచ్చరిక.. అతన్ని మార్చండి

Prashant Kishor : బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం తరువాత ప్రశాంత్ కిషోర్ బీజేపీ అధిష్టానంకు కీలక సూచనలు చేశారు.

Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బిహార్‌ రాష్ట్రంలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి అయిన నీరజ్ కుమార్ సిన్హాపై భారీ ఓట్ల ఆధిక్యంతో విజయదుందుబి మోగించారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇక్కడ 30ఏళ్లుగా బీజేపీకి అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కంచుకోటను బద్దలుకొడుతూ ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు.

Also Read : Prashant Kishor : ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం.. బీజేపీ కంచుకోట బద్దలు

విజయం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ విజయంతో బాంకిపూర్ ప్రజలు నాపై ఉంచిన ఆశీర్వాదాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా మొదటి ప్రాధాన్యం. బాంకిపూర్ అభివృద్ధికి నా వంతు కృషిచేస్తాం. రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో ఆ మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. నేను పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలనుకోవడం లేదు. నేను ఎమ్మెల్యే అయినంత మాత్రాన బాంకిపూర్ ఒక్కరాత్రిలోనే బెంగళూరులా మారిపోదు. కానీ, వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో ఇక్కడ కొన్ని స్పష్టమైన మార్పులు మాత్రం తప్పకుండా కనిపిస్తాయని చెప్పారు.

బంకిపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. దయచేసి బీహార్‌కు మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించండి. సమ్రాట్ చౌధరీ స్థానంలో కుష్వాహా వర్గానికి చెందిన మరో నాయకుడిని బీజేపీ ఎంపిక చేయాలనుకుంటే అది పూర్తిగా వారి నిర్ణయం. దానిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఎవరిని ఎంపిక చేసినా ఆయన సమర్థుడై, నిజాయితీగల వ్యక్తి అయ్యి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బీహార్ అభివృద్ధి చెందాలి. రాష్ట్రం ముందుకు సాగాలి. ఎవరు గెలిచారు? ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. అదే ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ బీహార్ అభివృద్ధే అత్యంత ముఖ్యమైనది అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.