Travellers
Omicron Threat : ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వ్యాప్తిని ప్రారంభంలోనే కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరనమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎట్ రిస్క్(ముప్పు పొంచి ఉన్న)దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నిర్దేశించిన ఎయిర్ పోర్ట్ లలో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడాన్ని తాజాగా కేంద్రం తప్పనిసరి చేసింది.
మంగళవారం విమానయాన మంత్రిత్వశాఖ..ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్-20 నుంచి ఎట్ రిస్క్ దేశాల నుంచి భారత్ లోని హైదరాబాద్,ఢిల్లీ,ముంబై,కోల్ కతా,చెన్నై,బెంగళూరు ఎయిర్ పోర్ట్ లకు చేరుకునేవారు తప్పనిసరిగా ముందుగానే ఎయిర్ పోర్ట్ లలో ఆర్టీ-పీసీఆర్ టెస్ట్(కోవిడ్ టెస్ట్) కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేసుకునేందుకు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు అనుమతించేలా ఎయిర్ సువిధ పోర్టల్లో మార్పులు చేయనున్నట్లు సర్క్యులర్ లో తెలిపింది.
ముందస్తు బుకింగ్, చెల్లింపుల మొదలైన దాంట్లో ఎలాంటి సమస్య లేకుండా చూసేందుకు మొదట ఆరు నగరాల్లో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు టెస్ట్ లు చేసేందుకు ముందస్తుగా స్లాట్ బుక్ చేయడం సంబంధిత విమానయాన సంస్థలదే బాధ్యతని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, విమానం ఎక్కే ముందు తమ ప్రయాణికులు తప్పనిసరిగా ముందస్తు బుకింగ్ను తనిఖీ చేయాలని అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఏ సూచించింది.
కాగా,బ్రిటన్ ఇప్పటికే ఇలాంటి మార్గదర్శకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిబంధనతో దేశానికి వచ్చే ప్రయాణికులంతా ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండగా, నిబంధనలు పాటించడంలో విఫలమైతే బ్రిటన్ లోని విమానాశ్రయానికి చేరుకునేందుకు ఆయా దేశాల్లో విమానంలో ఎక్కేందుకు అనుమతించడం లేదు.
కాగా, 12 దేశాలు(దక్షిణాఫ్రికా,టాంజానియా, బొత్స్వానా,బ్రిటన్,చైనా,ఘనా,మారిషస్,న్యూజిలాండ్,జింబాబ్వే,హాంకాంగ్,ఇజ్రాయెల్,బ్రెజిల్)లను ఎట్ రిస్క్ జాబితాలో ఉంచింది కేంద్రప్రభుత్వం.
ALSO READ Adar Poonawalla : 6 నెలల్లోగా పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్!