పబ్ జీ ప్రియులకు బ్యాడ్ న్యూస్

PUBG Mobile India దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనీస్ యాప్ ‌లను నిషేదించిన విషయం తెలిసిందే. నిషేదించబడిన యాప్ లలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన “పబ్ జి” యాప్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ గేమ్ నిర్వాహకులు టెన్సెంట్ గేమ్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని ప‌బ్‌జి కార్పొరేషన్ సొంత సంస్థ‌గా భార‌త్‌ లో రిజిస్ట‌ర్ చేసుకుంది. దీనిలో భాగంగా “పబ్ జి మొబైల్ ఇండియా” పేరుతొ తిరిగి మార్కెట్లోకి రావాలని భావిస్తుంది. అయితే, గేమ్‌ ను మ‌ళ్లీ భార‌త్‌లో లాంచ్ చేసేందుకు ఇంకా ప‌బ్‌జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమ‌తులు లభించడంలేదు.

ఇటీవల ఒక వ్యక్తి… పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. పబ్ జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు అని ప్రకటించింది. దీంతో భారత్ లో పబ్జి గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ ఆర్టీఐ ప్రశ్నను నవంబర్ 30న దాఖలు చేసినట్లు సమాచారం.

మరోవైపు, పబ్ జి గేమ్ డెవలపర్లు తెలిపిన ప్రకారం.. పబ్ జి మొబైల్ ఇండియా గేమ్ లో స్థానిక సంస్కృతీ ప్రతిబింబించేలా ఆటలో మార్పుచేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు ఎక్కువ సేపు గేమ్ ఆడకుండా ఉండటానికి కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పబ్జి కార్పొరేషన్ పాత్రల దుస్తులు, గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్, ఆట సమయంపై పరిమితులు విధించినట్లు తెలిపారు. అలాగే కొత్తగా వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే, ఇప్పటికే కొన్ని పబ్జి గేమ్ ఏపీకే లింకులు బయట కనిపిస్తున్నాయి. అయితే, హ్యాకర్స్ ఈ ఏపీకే లింకులు ద్వారా మీ మొబైల్ ని హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.