Arindam Bagchi @MEAIndia
ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు కోర్టులో ఊరట లభించింది. వారి మరణశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ శాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది.
భారత్కు చెందిన ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులు కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్నారు. ఇటీవల వారికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం ఆ తీర్పును భారత ప్రభుత్వం అప్పీల్ చేసింది.
దాన్ని పరిశీలించిన కోర్టు ఇవాళ ఆ ఎనిమిది మంది భారతీయులకు శిక్షను తగ్గించింది. కాగా, ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీ అల్ దహ్రాలో ఈ ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులు కొంత కాలంగా పనిచేశారు.
వారిని 2022, ఆగస్టులో ఖతార్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. వారు ఎనిమిది మంది ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారని అభియోగాలు మోపారు. రెండు నెలల క్రితం ఆ ఎనిమిది మందికి కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో భారత విదేశాంగ శాఖతో పాటు న్యాయ నిపుణులు అక్కడి కోర్టులో పోరాడారు.