Madan Dilawar: జెన్ జీ ఎఫెక్ట్.. మరో మంత్రి పదవి ఔట్?
రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్(Madan Dilawar) తీవ్ర రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- August 29, 2026 / 04:39 PM IST
Rajasthan education minister madan dilawar faces resignation demands
- దాడితో రాజుకున్న తీవ్ర వివాదం
- మంత్రి దిలావర్ రాజీనామాకు డిమాండ్
- పెరిగిన తీవ్ర రాజకీయ ఉద్రిక్తత
Madan Dilawar: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్(Madan Dilawar) తీవ్ర రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. యువజన శక్తి ఆధారిత కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా జైపూర్ రాంపురా-కన్వర్పురా గ్రామ పాఠశాల తనిఖీకి వెళ్లిన వాలంటీర్లపై దాడి జరగడం ఈ వివాదానికి మూలంగా మారింది. గేదెల కొట్టంలో నడుస్తున్న పాఠశాల దుస్థితిని వెలికితీసేందుకు వెళ్లిన ఆశుతోష్ రంకా నేతృత్వంలోని CJP బృందంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ హింసను ఖండించాల్సింది పోయి, గ్రామస్థులు పాఠశాలను కాపాడుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి.
Mamata Banerjee: మమతా బెనర్జీకి హైకోర్టు ఊహించని షాక్.. సుమోటోగా FIR నమోదు
పాఠశాలల అధ్వాన స్థితి, ఆంక్షల వివాదం:
పాఠశాలల్లో మౌలిక వసతుల లోపాలు బయటపడకుండా చూసేందుకు విద్యాశాఖ మీడియా, బయటి వ్యక్తుల చిత్రీకరణపై ఆంక్షలు విధించడంపై CJP మండిపడింది. ఝాలావర్ భవన కూల్చివేత ప్రమాదం, కోటా జిల్లాలో మిడ్-డే మీల్స్ తినడం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు మంత్రి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలోని 63,000 ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది గదులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని CJP 48 గంటల గడువు విధించింది.
మంత్రిపై కాంగ్రెస్ సుడిగాలి దాడి:
మరొకవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా మదన్ దిలావర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో శాసనసభ్యులు భారీ ధర్నా చేపట్టి సభను బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా ఆరోపించగా, విమర్శలకు బదులుగా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పాఠ్యపుస్తకాల నుండి గాంధీ-నెహ్రూ కుటుంబ చరిత్ర తొలగింపును రాజకీయ ప్రేరేపిత చర్యగా కాంగ్రెస్ ఖండించడంతో మంత్రి రెండు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
