Reverse Repo Rate : మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ ప్రభావంతో ఈ సారి కూడా ఆర్బీఐ తన వడ్డీ రేట్లను మార్చలేదని శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేటును 4 శాతం వద్దే ఉంచాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచామని ఆయన తెలిపారు. కరోనా అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని తెలిపారు దాస్. పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు వల్ల.. వాటి డిమాండ్ పెరుగుతుందని శక్తికాంత్ దాస్ అన్నారు.
చదవండి : RBI : ఇంటర్నెట్ లేకుండా…డిజిటల్ చెల్లింపులు!
కాగా అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి ఆర్బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. అప్పటి నుంచి దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఒమిక్రాన్ వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండకపోవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నప్పటికీ.. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కలవరపెడుతోంది. దీంతో ఈసారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు.
చదవండి : RBI KYC : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ వార్నింగ్