రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ పూర్తి నిలిపివేసిందా? ఇకపై వాటిని అసలు ముద్రణ చేయరా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇకపై రూ.2 వేల నోట్ల సంఖ్య మరింతగా తగ్గనుంది అనేది స్పష్టమవుతోంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెద్దనోటు ముద్రణకు ఫుల్స్టాప్ పెట్టింది.
నాలుగేళ్ల క్రితం రూ.వెయ్యి, పాత 500 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో రూ. 2వేల నోటును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2016-17లో ఏకంగా రూ.354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. గతేడాది నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
రూ. 500 నోట్ల ముద్రణ గణనీయంగా పెంపు:
బ్లాక్మనీకి ముకుతాడు వేయాలని భావిస్తున్న కేంద్ర సర్కారు.. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోట్ల ముద్రణను తగ్గించి రూ. 500 నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016-17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ. 500 నోట్లను ప్రింటింగ్ చేసింది. నాలుగేళ్ల క్రితం 429.22 కోట్ల నోట్లను ముద్రించగా.. గడచిన ఆర్థిక సంవత్సరం 822.77 కోట్ల నోట్లను అందుబాటులోకి తెచ్చింది.
గత నాలుగేళ్లలో 7వేల 071 కోట్ల కొత్త నోట్ల ముద్రణ:
గత నాలుగేళ్లలో అన్ని రకాల నోట్లను కలిపి 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ఇందులో రూ. 500 నోట్లు 2458 కోట్లు ఉండగా.. రూ. 2 వేల నోట్లు 370 కోట్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్ల ప్రింటింగ్ను కూడా రిజర్వ్ బ్యాంక్ తక్కువ చేసింది. డిజిటల్ పేమేంట్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నందున చిన్ననోట్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్న ఆర్బీఐ… వ్యయం తగ్గింపులో భాగంగా ఈ నోట్ల ముద్రణను కూడా క్రమేణా తగ్గిస్తోంది. నాణేలను అందుబాటులోకి తెచ్చినందున గత నాలుగేళ్ల నుంచి రూ. 1, 2, 5 నోట్లను ముద్రణను ఆపేసింది.
రూ. 200 నోటు ముద్రణకే ఎక్కువ ఖర్చు:
కరెన్సీ ముద్రణలో రూ. 200 నోటుకే ఎక్కువ ఖర్చవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ నోటుకే అధికంగా వ్యయం చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
* రూ. 200 నోటు ప్రింటింగ్కు రూ. 2.15 చొప్పున ఖర్చు
* రూ. 500 నోటుకు రూ. 2.13 ఖర్చు
* రూ. 100 నోటు ముద్రణకు రూ. 1.34 ఖర్చు
* రూ. 50 నోటుకు 82 పైసలు ఖర్చు
* రూ. 20 నోటుకు దీనికంటే మూడు పైసలు అధికంగా (85 పైసలు) ముద్రణకు వెచ్చించింది.
* అతి తక్కువగా రూ. 10 నోటు ప్రింటింగ్కు 75 పైసలు వ్యయమవుతోందని తెలిపింది.
* గతేడాది రూ. 2 వేల నోటు ముద్రించినందున..ఈ సమాచారాన్ని ఆర్బీఐ ముద్రణ సంస్థ వెల్లడించ లేదు.
గత నాలుగేళ్లుగా ముద్రించిన నోట్ల సంఖ్య (కోట్లలో)
సంవత్సరం రూ. 500 నోటు రూ. 2 వేల నోటు
2016–17 429.22 354.29
2017–18 578.10 11.15
2018–19 628.48 4.66
2019–20 822.77 –
==============================
మొత్తం 2,458.57 370.1
పెద్ద నోట్ల వల్ల బ్లాక్ మనీ పెరుగుతోందని ఆరోపించిన మోడీ ప్రభుత్వం, రూ.వెయ్యి, పాత 500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో రూ. 2వేల నోటును ప్రవేశపెట్టింది. కాగా, ఇంకా పెద్ద నోటుని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బ్లాక్ మనీ అరికడతామని చెప్పి, అంతకంటే పెద్ద నోటుని తీసుకురావడం అందరిని విస్మయానికి గురి చేసింది. దీని వల్ల దేశంలో నల్ల ధనం మరింత పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా రూ.2వేల నోటు గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కేంద్రం వాటిని రద్దు చేస్తుందనే వార్తలు జోరుగా వినిపించాయి. చాలా రోజులుగా ఏటీఎంలలో ఎక్కడా రూ.2వేల నోటు కనిపించడం లేదు. దీంతో రూ.2వేల నోటు రద్దు ఖాయం అనే వార్తలకు బలం చేకూరింది. అయితే ఎప్పటికప్పుడు ఆర్బీఐ ఆ వార్తను ఖండిస్తూ వచ్చింది. అందులో నిజం లేదని తేల్చి చెప్పింది.