ఐదు నగరాల్లో రైస్ ఏటీఎంలు, రేషన్ షాపుకు పోవాల్సినవసరం లేదు
- madhu
- Published On : February 21, 2021 / 11:34 AM IST
Rice ATMs in five cities : ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటామో..అలాగే..రైస్ తీసుకోవచ్చు. త్వరలోనే రేషన్ బియ్యం, గోధుమలను పొందేలా ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఐదు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు.
పేద ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లకుండానే ఈ మిషన్లను ద్వారా సరుకులను పొందే అవకాశం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించదన్నారు. రేషన్ షాపుల వద్ద ఎలాంటి రష్ ఉంటుందో అందరికీ తెలిసిందే. గంటల తరబడి..క్యూ నిల్చోవడం ద్వారా పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు.
అంతేగాకుండా..రేషన్ దుకాణం యజమాని ఎప్పుడొస్తాడో..ఎప్పుడు తెరుస్తాడో అర్థం కాదు. ఇక ఇలాంటి కష్టాలు పడొద్దని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగమే రైస్ ఏటీఎంలు. బియ్యం, గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా..ఆ రాష్ట్రంలోనే సేకరిస్తే…రవాణా ఖర్చు తగ్గుతుందని పాండే తెలిపారు. కాలం చెల్లిన గోదాముల స్థానంలో ఉక్కు గాదెల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
