road accident : Union Minister Shripad Nayak seriously injured, his wife dead : కేంద్ర ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ (68) ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ సతీమణి విజయ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీపాద నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా వాహనం అదుపుతప్ప బోల్తా కొట్టింది. ఆస్పత్రికి తరలించే లోపే కేంద్రమంత్రి భార్య మరణించారని, చికిత్స పొందుతూ ఆయన పీఏ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, ఆయన భార్య విజయ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేంద్ర మంత్రి తన భార్యతో కలిసి ఆదివారం ఉడుపిలోని శ్రీకృష్ణ మఠంను సందర్శించారు. శనివారం ధర్మస్థలలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
అసస్మారక స్థితిలో ఉన్న కేంద్రమంత్రిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి శ్రీపాద్ నాయక్కు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కేంద్రమంత్రి శ్రీపాద త్వరగా కోలుకోవాలని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప ట్వీట్ చేశారు. శ్రీపాద భార్య మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్రీపాద నాయక్ త్వరగా కోలుకోవాలని పలువురు మంత్రులు, ఆయన మద్దతుదారులు కోరుకున్నారు.