Mohan Bhagwat : భారత్లో ముస్లింలు ఉండకూడదని హిందువు అనుకుంటే.. అతడు హిందువు కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్
Mohan Bhagwat : భారతదేశంలో ముస్లీంల గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Harish Thanniru
- Updated on- August 30, 2026 / 11:00 AM IST
Mohan Bhagwat
Mohan Bhagwat : భారతదేశంలో ముస్లీంల గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆయన ఉన్నారు. అక్కడ నిర్వహించిన యూనివర్సల్ వన్ నెస్ సెలబ్రేషన్ (Universal Oneness Celebration) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో ముస్లింల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Sonia Gandhi Autobiography : సోనియా బుక్ వివాదం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల వార్.. ఇంతకీ ఆత్మకథలో ఏముంది?
ఆర్ఎస్ఎస్ హిందూత్వ భావజాలం నేపథ్యంలో గతంలో ఆయనను పదేపదే అడిగిన ‘మరి ముస్లింల పరిస్థితి ఏమిటి’? అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమిచ్చారు. హిందువు అని చెప్పుకోవాలంటే అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని నమ్మాలి. ప్రతి మనిషికీ గౌరవం ఉంది. మనుషుల మధ్య ఎలాంటి తేడా లేదని భగవత్ అన్నారు.
గతంలో ఓ కార్యక్రమంలో తనకు ఎదురైన అనుభవాన్ని మోహన్ భగవత్ ప్రస్తావిస్తూ.. ఒకసారి నేను ప్రసంగిస్తున్నప్పుడు కొందరు ముస్లిం సోదరులు ఉన్నారు. మీరు హిందూ సంస్థ అని చెబుతున్నారు.. హిందూ రాష్ట్రం అంటున్నారు.. మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని భారత్ నుంచి వెళ్లగొడతారా? అని వారు అడిగారు. అందుకు నేను.. లేదు. అది హిందుత్వం కాదు అని చెప్పాను అని తెలిపారు. భారత్లో ఒక్క ముస్లిం కూడా ఉండకూడదని ఏ హిందువు భావించినా.. అతడు హిందువుగా కొనసాగలేడు అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
హర్యానాలో జరిగిన విమాన ప్రమాదాన్ని కూడా మోహన్ భగవంత్ ప్రస్తావించారు. హర్యానాలోని దాద్రీ ప్రాంతంలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఎక్కువ మంది ప్రయాణికులు ముస్లీంలే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులకు సేవలు అందించారు. మృతదేహాలను వెలికితీసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో మా స్వయం సేవకులు వీరు ముస్లింలు అని ఎప్పుడూ ఆలోచించలేదంటూ భగవత్ పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో లేకపోవడం వల్లనే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయగలిగామని భగవత్ చెప్పారు. తాము చేసిన సేవలను ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా సేవ చేయడమే తమ లక్ష్యమని మోహన్ భగవత్ అన్నారు.
#WATCH | New York, US: At the “One World One Humanity” event, RSS Chief Mohan Bhagwat says, “If any Hindu thinks that there should be no Muslim in Bharat, he will not remain Hindu. If you want to call yourself Hindu, you must believe that all paths are leading to the same goal… pic.twitter.com/e5UYZPppU8
— ANI (@ANI) August 29, 2026
