Scorpion bites: ఎయిరిండియా విమానంలో షాకింగ్ ఘటన.. ప్రయాణికురాలిని తేలు కుట్టింది..!
ముంబైలో ప్రయాణికులంతా విమానం దిగాక.. విమానంలో క్లీనింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ క్రమంలో తేలును గుర్తించారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
- Harishth Thanniru
- Published On : May 7, 2023 / 06:59 AM IST
Air India flight
Scorpion bites: విమానం (Flights) లో సజీవ పక్షులు, ఎలుకలు కనిపించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. తేలు కనిపించడం చాలా అరుదు. అందులోనూ విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టడం (Scorpio bites) అనేది అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. అలాంటి ఘటన ఎయిరిండియా విమానం (Air India flight) లో చోటు చేసుకుంది. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టింది. ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేలు కుట్టిన ప్రయాణికురాలికి ముంబైలో విమానం ల్యాండ్ అయిన తరువాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
Air India Flight: ఎయిరిండియా విమానంకు తృటిలో తప్పిన ప్రమాదం.. స్వీడన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ..
ప్రయాణికురాలికి తేలు కుట్టడంతో ఒక్కసారిగా నొప్పి అనిపించింది. దీంతో ఆమె నొప్పి అనిపించిన వద్ద చూసుకోగా తేలు కుట్టినట్లు గుర్తించి విమానంలో సిబ్బందికి తెలియజేసింది. కొద్దిసేపటికే ముంబైలో విమానం ల్యాండ్ కావడంతో చికిత్స నిమిత్తం ఆమె ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె డిశ్చార్జ్ అయినట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబైలో ప్రయాణికులంతా విమానం దిగాక.. విమానంలో క్లీనింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఈ క్రమంలో తేలును గుర్తించారు. ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే విమానంలో ధైర్యంగా ఎలా ప్రయాణించగలమని ప్రయాణికులు ప్రశ్నించారు. అయితే, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు చేపట్టాలని కేటరింగ్ డిపార్ట్ మెంట్కు ఎయిరిండియా సూచించింది. ఇదిలాఉంటే గత ఏడాది కాలికట్ నుంచి బయలుదేరి దుబాయ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఎయిరిండియా కార్గో విమానంలో పాము కనిపించింది.
