Madhya Pradesh : ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్.. మంటలు వ్యాపించి ఏడుగురు సజీవదహనం.. వేడుక జరిగే ఇంట్లో విషాదం..

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్, బెంగాలీ స్క్వేర్ సమీపంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

massive fire breaks out inside house in Indore Madhya Pradesh

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పెనువిషాదం
  • ఛార్జింగ్ అవుతున్న ఈవీ ఛార్జింగ్ పాయింట్ పేలడంతో మంటలు
  • పేలిన గ్యాస్ సిలిండర్లు.. కుప్పకూలిన ఇల్లు
  • ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్, బెంగాలీ స్క్వేర్ సమీపంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటి బయట ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్ పెట్టగా.. తెల్లవారుజామున ఛార్జింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి కారులో మంటలు చెలరేగాయి.. చూస్తుండగానే.. ఆ మంటలు మూడు అంతస్తుల ఇంటికి వ్యాపించాయి.. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్లుసైతం పేలడంతో నిద్రలోనే ఏడుగురు సజీవదహనం అయ్యారు.

Also Read : Shivaji: ‘సరిపోదా శనివారం’ చూసి అద్దాన్ని పగలగొట్టిన శివాజీ.. అసలు ఏం జరిగిందంటే?

పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వ్యాపారి మనోజ్ పుగాలియా తన ఎలక్ట్రిక్ కారును ఇంటి బయట ఛార్జింగ్ పెట్టారు. తెల్లవారుజామున ఛార్జింగ్ పాయింట్ వద్ద ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ జరిగి కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూస్తుండగానే మూడు అంతస్తుల ఇంటి అంతటికి వ్యాపించాయి. ఆ ఇంట్లో సుమారు పదికిపైగా సిలీండర్లు ఉండగా.. వీటిలో కొన్ని సిలిండర్లు వరుసగా పేలిపోవడంతో మంటలు వ్యాప్తి పెరిగింది.

పేలుళ్ల తీవ్రతకు ఇంటిలోని ఒక పైభాగం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన ఇంట్లో తొమ్మిది మందికిపైగా ఉన్నారు. మంటలు వ్యాపించగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులు లోపలే చిక్కుకుపోయారు. కొందరు లోపలి నుంచి బయటకు పరుగులు తీశారు. రెస్క్యూ టీమ్ వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొందరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో ఇంట్లో నిల్వ ఉంచిన రసాయనాలు మంటలను మరింత వ్యాపింపజేశాయని, వీటి తీవ్రతకు లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. మనోజ్ పుగాలియా ఇంట్లో జరుగుతున్న వేడుక కోసం వచ్చిన బంధువులు ఇలా విగతజీవులుగా మారడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల్లో విజయ్ సేథియా (65), చోటూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ (65), సిమ్రాన్ (30), రాశి సేథియా (12)గా పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.