ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమాన్ను అమెరికా హతమార్చడంపై భారతదేశంలోని కార్గిల్లో షియా గ్రూప్కు చెందిన వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. జమైత్ ఈ ఉలెమా ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. యూఎస్ దాడులపై కార్గిల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని షేక్ నజీరుల్ మెహదీ వెల్లడించారు. సోలేమాన్ను హతమార్చినప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇరాన్… అందుకు ప్రతీకారం తీర్చుకునే పని మొదలుపెట్టింది.
ఈ ఘటనపై 2020, జనవరి 04వ తేదీ శనివారం కార్గిల్, లడఖ్ యూటీ, బుద్గాం ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రజలు రోడ్లకు మీదుకు వచ్చారు. యూఎస్ డ్రోన్ దాడిపై నిరసన వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోలైమానీ అనేక దేశాల్లో ఉగ్రవాదం తొలగించారని నజీరుల్ తెలిపారు. కాశ్మీర్ లోయలోని పలు చోట్ల అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. బుద్గామ్ ప్రధాన మార్కెట్ వద్ద భారీ సంఖ్యలో ప్రజలు దాడిని ఖండించారు. శ్రీనగర్లోని జాదిబాల్ ప్రాంతంలోని హసనాబాద్ వద్ద వందలాది మంది నిరసన తెలిపారు.
శుక్రవారం బగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో సులేమానీ, ఇరాక్కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించగా.. పశ్చిమాసియాలో భారీ బలగాలను మోహరించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
ఇరాక్పై మిస్సైల్స్తో విరుచుకుపడింది. బాగ్దాద్లోని ఎయిర్బేస్పై రాకెట్లతో దాడిచేసింది. ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్గా దాడులు చేయడంతో అలర్టయిన అధికారులు… ఎంబసీలోని వారందరినీ హుటాహుటిని ఖాళీ చేయిస్తున్నారు. వేలమంది అమెరికన్లను పొట్టనపెట్టుకోవడం వల్లే సులేమానీని చంపాల్సి వచ్చిందని అమెరికా పేర్కొంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Read More : CAA, NRC, NPRపై యశ్వంత్ సిన్హా యాత్ర