Sitting : ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేవారు వృత్తిరీత్యా గంటల కొద్దీ కుర్చీలోనే కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా గంటల తరబడి కూర్చోవడం వలన శారీరకంగానే కాక మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. నిత్యం కదలకుండా గంటల తరబడి కూర్చోవడం వలన వ్యాయామం చేసినా ప్రయోజనం లేకుండా పోతుందట.
తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హార్డర్స్ ఫీల్డ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో గంటలతరబడి కూర్చోవడం వలన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని తేల్చారు. వారానికి 150 నిముషాలు వ్యాయామం చేసిన ప్రయోజనం ఉండదని వెల్లడించారు. దానినుంచి బయటపడాలంటే వ్యాయామానికి మరింత ఎక్కువ సమయం కేటాయించాలని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్ ఫర్ హెల్త్ జర్నల్లో ఈ వివరాలను వెల్లడించారు.
ఇక ఇదే అంశంపై శాస్త్రవేత్త లియానే ఎజివేడో మాట్లాడుతూ.. తాము 300 మందిపై పరిశోధనలు జరిపామని వీరిలో 50 శాతం మంది ఎనిమిది గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటున్నారని, గంటల తరబడి కూర్చోవటంతో ఈ 50 శాతం మంది మానసిక ఆరోగ్య పరిస్థితి, సాధారణ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
ఎనిమిది గంటలు కూర్చొని పనిచేయడం తప్పని పరిస్థితుల్లో వ్యాయామం చేసే సమయం పెంచాలని సూచించారు. 8 గంటలకు మించి కూర్చుంటే కనీసం 60 నిముషాలు వ్యాయామం చేయాలనీ వివరించారు. వ్యాయామం అంటే జిమ్ కి వెళ్లి బరువులు ఎత్తడం ఒక్కటే కాదని.. నడవడం.. పెరట్లో పనులు చేయడం వంటివి కూడా వ్యాయామం కిందకే వస్తాయని తెలిపారు.