Solar Eclipse 2022 : సూర్యగ్రహణం ముగిసింది. మన దేశంలో గ్రహణం పాక్షికంగానే కనిపించింది. గ్రహణాన్ని చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు. తెలుగు రాష్ట్రాల్లో 49 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గ్రహణం కారణంగా ఉదయం నుంచి ఆలయాలు మూతపడ్డాయి. సంప్రోక్షణ, శుద్ధి తర్వాత ఆలయాలు తెరుచుకోనున్నాయి.
మంగళవారం సాయంత్రం (అక్టోబర్ 25) ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో మొదలైంది సూర్య గ్రహణం. ఈ పాక్షిక సూర్య గ్రహణం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటల వరకు (ప్రాంతాలను బట్టి స్వల్పంగా మార్పులు ఉండొచ్చు) కొనసాగింది.
గ్రహణం ముగియడంతో స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచించారు. సూర్య గ్రహణంతో అతినీలలోహిత కిరణాలు భూమిపై పడటంతో కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. వండిన, నిల్వ ఉంచిన ఆహారంపై దర్బ వేసిన తర్వాతే తినాలని తెలిపారు. అటు గ్రహణం వీడిన తర్వాత దానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుపు రంగు వస్త్రాలు, పాలు, పెరుగు దానం చేయాలని అంటున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
గ్రహణం ముగిసిన తర్వాత చేయాల్సిన పనులు..
అందరూ తలస్నానం చేయాలి.
ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఆహార పదార్థాలపై ఉంచిన దర్భలను తీసేయాలి.
పూజ మందిరంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాల్ని శుద్ధిచేయాలి.
సూర్య చంద్రులకు గ్రహణాలు ఏర్పడే సమయంలో ఆహార నియమాలు పాటించడం, స్నానాలు, శుద్ధి చేసుకోవడం నియమంగా వస్తోంది.
గ్రహణం తర్వాత దీపారాధన, ఇతర పనులన్నీ కొనసాగించుకోవచ్చు.
చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు గ్రహణం సమయంలో పాలు వంటి పదార్థాలు తీసుకోవచ్చు.
అన్నం స్వీకరించకూడదని నియమం.
గ్రహణ సమయంలో ఆహార పదార్థాలను తినకూడదన్న నియమం అన్నింటికీ (అన్నానికి తప్ప) వర్తించదు. గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి అన్నం వండుకొని తినాలి.
గ్రహణానికి ముందు నిల్వ ఉంచిన పాలు, పెరుగు, మజ్జిగ, ఆవకాయ వంటి పదార్థాలు యథావిథిగా వినియోగించవచ్చు. వాటిపై దర్భలను ఉంచడం మంచిది.
కాగా, సుమారు 22 ఏళ్ల తర్వాత దీపావళి రోజున ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడికి అడ్డుగా చంద్రుడు రావడంతో గంటన్నరకు పైగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ సమయంలో దేశంలోని జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సూర్యుడు సరికొత్తగా కనిపించాడు. ఈ తరహా సూర్యగ్రహణం మళ్లీ 2032లో ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చివరిగా 2007లో భారత్ లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. మళ్లీ దేశంలో సూర్య గ్రహణం కనిపించేది మరో పదేళ్ల తర్వాతే. నవంబర్ 3, 2032లోనే తిరిగి మన దేశంలో సూర్య గ్రహణాన్ని చూడొచ్చు. ఈ ఏడాది ఇంకో సూర్య గ్రహణం ఉన్నప్పటికీ, అది మన దేశంలో కనిపించే అవకాశం లేదు.