New Parliament building: మేం జోక్యం చేసుకోలేము.. కొత్త పార్లమెంట్ భవనంపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు. ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
- Harishth Thanniru
- Published On : May 26, 2023 / 01:56 PM IST
supreme court
Supreme Court: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బదులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను సుప్రింకోర్టు తిరస్కరించింది. గురువారం న్యాయవాది సిఆర్ జయసుకిన్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై శుక్రవారం న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు ఇలాంటి పిటిషన్లతో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆర్టికల్ 32 ప్రకారం దానిని స్వీకరించడానికి మాకు ఆసక్తి లేదని జస్టిస్ నరసింహ అన్నారు. ఇలాంటి పిటిషన్ వేసినందుకు మేం ఎందుకు జరిమానా విధించకూడదు అని పిటిషనర్కు సుప్రింకోర్టు తెలిపింది.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఎవరు ఏమంటున్నారంటే?
విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున వాదిస్తూ.. భారత రాష్ట్రపతి, ఉభయ సభలు రాజ్యసభ, లోక్సభలతో పార్లమెంట్ ఏర్పడుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 79ని పిటిషనర్ పేర్కొన్నాడు. ప్రతివాదులు రాజ్యాంగాన్ని పాటించడం లేదని పటిషన్లో పేర్కొన్నారు. అంతేకాక, ప్రతిపార్లమెంటరీ సెషన్ ప్రారంభంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని తప్పనిసరి చేసే ఆర్టికల్ 87ని కూడా పిటీషన్ ప్రస్తావించారు. ఈ రాజ్యాంగ నిబంధనను విస్మరిస్తున్నారని, ఇది రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముకు అవమానానికి దారితీసిందని పిటిషనర్ వాదించారు.
దీనిపై సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు. ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదు. ఎగ్జిక్యుటివ్ హెడ్ (ప్రధాని) పార్లమెంట్ సభ్యుడు అని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగ అధిపతి (అధ్యక్షుడు) పార్లమెంట్లో భాగం. పిటిషన్ను కొట్టివేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అనంతరం పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు న్యాయవాది అనుమతి కోరారు. అందుకు న్యాయమూర్తి పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చారు.
