Supreme Court : కేరళ సర్కార్ నిర్ణయంపై సుప్రీం ఆగ్రహం..ప్రజల ప్రాణాలు పణంగా పెడతారా!
దేశంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
- venkaiahnaidu
- Published On : July 20, 2021 / 07:34 PM IST
Court3
Supreme Court దేశంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ బక్రీదు సెలబ్రేషన్ల కోసం కోవిడ్ నిబంధనలను సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అనుచితమని పేర్కొంది. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఈ సడలింపులు చేయడం అనవసరమని వ్యాఖ్యానించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వం..కరోనాకి ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని కోర్టు పేర్కొంది. కేరళ ప్రభుత్వ కోవిడ్ నిబంధనల సడలింపులపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సడలించిన నిబంధనల వల్ల మరింత వైరస్ వ్యాప్తి జరిగితే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేరళ సర్కార్ను అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.
లాక్డౌన్ నిబంధనలను సడలించాలని వ్యాపారులు చేసిన డిమాండ్కు కేరళ సర్కార్ తలవంచడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జీవించే హక్కు గురించి పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ప్రభుత్వం గమనించాలని సూచించింది. ఈ ఆంక్షల సడలింపు వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపిస్తే.. దానిపై ఎవరైనా కేసు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పిటిషన్ ను పరిశీలించి ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ధర్మాసనం హెచ్చరించింది. కన్వర్ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని పినరయి విజయన్ సర్కార్ను కోర్టు ఆదేశించింది.
