Firecrackers in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో టపాసులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, టపాసులపై నిషేధం ఉండాల్సిందే అని అభిప్రాయపడింది. కొంతకాలం క్రితం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం టపాసులపై పూర్తిగా నిషేధం విధించింది.
టపాసులు అమ్మడం, కొనడం, కాల్చడం వంటి అన్నింటిపైనా నిషేధం ఉంది. ఆన్లైన్లో తెప్పించుకోవడం, రవాణా చేయడం కూడా నేరమే. అయితే, పండుగల సందర్భంగానైనా ఢిల్లీ పరిధిలో టపాసులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎమ్.ఆర్.షాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇప్పటికే ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన ఆదేశాలు జారీ చేశామని, తిరిగి వీటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోలేమని చెప్పింది. తక్కువ కాలుష్యం వెదజల్లే గ్రీన్ క్రాకర్స్ను కూడా అనుమతించబోమని వ్యాఖ్యానించింది.
Girl Drowns: నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అక్క
ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని, టపాసులకు అనుమతిస్తే దీపావళి తర్వాత కాలుష్యం మరింత పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. కాగా, పండుగల సందర్భంగా టపాసులు కాల్చడం, రవాణా చేయడం వంటివి చేసే సామాన్యులపై పోలీసులు కేసు నమోదు చేయకుండా చూడాలని కూడా మనోజ్ తివారి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఎలాంటి పండుగల సందర్భంగానైనా టపాసులపై నిషేధం ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.