ఈఎంఐలపై వడ్డీలతో బ్యాంకులు వేధించొద్దు.. మారటోరియంపై సుప్రీంకోర్టుకు పిటిషనర్‌

  • Publish Date - September 2, 2020 / 08:08 PM IST

కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మారటోరియంపై చెల్లించే వడ్డీలపై బ్యాంకులు రుణదారులను వేధించరాదంటూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో రటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై వడ్డీ వసూళ్లతో రుణదారులను ఇబ్బంది పెట్టరాదని ఆయన సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు.



కరోనా వైరస్‌తో అందరి ఆదాయాలు తగ్గిపోయాయని చెప్పారు. ఈ ఏడాదిలో మార్చి 27న అన్ని ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం కొనసాగడంతో మారటోరియంను ఆగస్ట్‌ 31 వరకూ RBI పొడిగించింది. మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ విచారించింది.



ఈ తుది విచారణలో పిటిషనర్‌ వాదనలు వినిపించారు. వడ్డీపై వడ్డీ చెల్లించడం రుణదారులకు తీవ్ర భారమవుతుందని తెలిపారు. మారటోరియం​ వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీలు పెరిగిపోయాయని పిటిషనర్‌ గజేంద్ర శర్మ న్యాయవాది రాజీవ్‌ దత్తా కోర్టుకు తెలిపారు. మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు, వడ్డీపై వడ్డీ వసూలు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సమీక్షించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.



రుణాల చెల్లింపుపై మారటోరియం వ్యవధిని రెండేళ్లు పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ కోర్టుకు వివరించాయి. వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ మౌలిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం.. రుణాలను తిరిగి చెల్లిస్తున్నవారికి అన్యాయం జరుగుతుందని కేంద్రం కోర్టుకు వివరించింది.

ట్రెండింగ్ వార్తలు