Patanjali Ads Case : పతంజలి ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్

హెర్బల్ ఉత్పత్తుల యాడ్స్ పై గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరిత ప్రకటనలు వెంటనే ఆపేయకపోతే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Patanjali Ads Case

Patanjali Ads Case : పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇస్తున్న యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని న్యాయస్థానం మండిపడింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ఇంకా జాప్యం చేయటం తగదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాము తయారు చేస్తున్న హెర్బల్ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయంటూ చాలాకాలంగా ప్రకటనలు ఇస్తూ వస్తోంది పతంజలి సంస్థ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతేడాది సుప్రీంకోర్టులో కేసు వేసింది ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్). పతంజలి సంస్థ ఇస్తున్న ప్రకటనలను డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయని, ప్రభుత్వం ఇలాంటి వాటిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అయితే హెర్బల్ ఉత్పత్తుల యాడ్స్ పై గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరిత ప్రకటనలు వెంటనే ఆపేయకపోతే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

పతంజలి సంస్థకు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది సుప్రీంకోర్టు. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ నోటిసులు ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పంతజలి వైద్య ఉత్పత్తులను ప్రచారం చేయకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది. అల్లోపతికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) పిటిషన్‌పై విచారణ సందర్భంగా పతంజలి సంస్థకు నోటిసులు జారీచేసింది సుప్రీంకోర్టు.

గత ఏడాది నవంబర్ లో కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి సంస్థ ప్రచారం నిర్వహించిందని ఆరోపిస్తూ ఐఎంఎ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలను అస్సలు సహించేది లేదంది జస్టిస్ అమానుల్లా ధర్మాసనం. యోగా సాయంతో మధుమేహం, ఆస్తమాను పూర్తిగా నయం చేయగలమని పతంజలి ప్రకటనలు ఇస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు IMA తరపు సీనియర్ న్యాయవాది PS పట్వాలియా.

పతంజలి ఆయుర్వేదం సంస్థకు సంబంధించిన.. తప్పుదోవ పట్టించే ప్రకటనలు అన్నింటిని వెంటనే నిలిపివేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక వ్యాధిని నయం చేయగలదని తప్పుడు క్లెయిమ్ చేసిన ప్రతి ఉత్పత్తిపై కోటి రూపాయల వరకు జరిమానా విధించడాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.

 

ట్రెండింగ్ వార్తలు