కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనా ని కంట్రోల్ చేయలేమని పళనిస్వామి సర్కార్ భావించింది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది.
చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి జూన్ 30 వరకు గరిష్ట పరిమితం చేయబడిన లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో ఆయా జిల్లాల్లో ఉదయం 8గంటల నుంచి 2గంటల వరకు కిరానా, వెజిటల్ స్టోర్స్ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే రెండు ఆదివారాలు(జూన్-21,28)న ఎటువంటి సడలింపు లేకుండా పూర్తి స్థాయి షట్ డౌన్ ఉంటుందని సీఎం తెలిపారు.