Tejashwi Yadav: కాంగ్రెసే పెద్ద ప్రతిపక్షమన్న తేజశ్వీ.. మరి ప్రధాని అభ్యర్థిగా మద్దతు ఎవరికి?
తాజాగా తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని తేజశ్వీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ తొందరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకోనున్నారని ప్రకటించారు. బయట జరుగుతున్న ప్రచారం, తేజశ్వీ తాజాగా చేసిన వ్యాఖ్యలలు పరస్పర విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశమైంది
- tony bekkal
- Published On : September 12, 2022 / 09:26 AM IST
Tejashwi Yadav says Congress still largest Opposition party
Tejashwi Yadav: ఒకవైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా జేడీయూ అలయన్స్ అయిన ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. విపక్షాలు అంగీకరిస్తే నితీశే ప్రధాని అభ్యర్థని ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పోటీగా బిహార్ పార్టీలే ముందు వరుసలో ఉండబోతున్నాయని, అందుకు ఆర్జేడీ, జేడీయూ నేతలు పావులు కదుపుతున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయేనని తేజశ్వీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ తొందరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలుసుకోనున్నారని ప్రకటించారు. బయట జరుగుతున్న ప్రచారం, తేజశ్వీ తాజాగా చేసిన వ్యాఖ్యలలు పరస్పర విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకు రావడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2019 నాటి ఎన్నికల్లో అయితే బయటికి ప్రకటించపోయినప్పటికీ రాహులే అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఈసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు, ప్రధాని అభ్యర్థి రేసు నుంచి కూడా రాహుల్ తప్పుకున్నారు. అయితే ఇప్పటికీ రాహులే తమ అభ్యర్థని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి ఉంది. ఇది కాకుండా నితీశ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో రాహుల్ను సైతం నితీశ్ కలిసినప్పటికీ.. ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా తమకే మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే నితీశ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం. ఇప్పటికే నితీశ్ అభ్యర్థిత్వంపై బలమైన ప్రకటన చేసిన తేజశ్వీ.. మరి రాహుల్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కూడా స్పష్టత రావడం లేదు.
నితీశ్, లాలూ ఇద్దరు నేతలు సోనియాను కలవనున్నారని తేజశ్వీ ప్రకటించారు. నితీశ్ ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతు కోరేందుకు కలుస్తున్నారా? లేదంటే ప్రధాని అభ్యర్థి ఎవరైనా బీజేపీ వ్యతిరేక పోరాటంలో కూటమి బలానికి భేషరతు మద్దతు ప్రకటిస్తారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో చనువుగా ఉన్న ఆర్జేడీ.. కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీని ఓడించడం కష్టమనే అభిప్రాయంలో ఉంది. అంతే కాకుండా 2019లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించింది కూడా. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, నితీశ్ పాత్రలపై తేజశ్వీ ఏ స్టాండ్ తీసుకున్నారనేది అంతు చిక్కడం లేదు.
Jaishankar In Saudi: సౌది అరేబియా రాజుతో సమావేశమైన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్
