The Scheme Without Any Name Kejriwal
The scheme without any name : నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్ సరకులు అందించాలనే పథకానికి ఢిల్లీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, ఈ పథకం (మార్చి 25, 2021) నుంచి అమలు కానున్నట్లు తెలిపింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా గోధుమలు, బియ్యం, చక్కెరను బ్యాగుల్లో ప్యాక్ చేసి వినియోగదారుల ఇంటికే పంపిణీ చేయనున్నట్లు వివరించింది.
‘ఈ పథకానికి పేరు పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సరకులు అందిస్తోంది. కానీ మా ప్రభుత్వం నేరుగా వినియోగదారుల ఇంటికే రేషన్ అందించనుంది. ఈ పథకానికి పేరు పెట్టడం ఉపయోగకరం కాదు. అందుకే పేరు ప్రస్తావించకుండానే ఈ పథకాన్ని అమలు చేయనున్నాం. ఇందులో మా ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ అక్కరలేదు. దీన్నీ కేబినెట్ మీటింగ్ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతాం. దీనికి కేంద్రం ఎటువంటి అడ్డంకి చెప్పదని ఆశిస్తున్నాం’..అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.