ownership of Air India to TATA : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి టాటాల చేతికి వెళ్లనుంది. ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుండడానికి ఇవాళే ముహూర్తం. మరికొన్ని గంటల్లో అధికారికంగా మార్పిడి కార్యక్రమం పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరుకే ఎయిరిండియాను టాటాకు అప్పగించాలి. కానీ బ్యాలెన్స్ షీట్ ఫైనలైజ్ చేయడంలో జాప్యం జరిగింది. దీనికి తోడు రెగ్యులేటర్ల అనుమతులు ఆలస్యమయ్యాయి.
ఎయిరిండియా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో బిడ్లు దాఖలు కాకపోవడంతో చాలా కాలం నిరీక్షించింది. అయితే ఎయిరిండియాలో వంద శాతం వాటాలు పొందేందుకు గతేడాది 18 వేల కోట్ల రూపాయలతో టాటా సంస్థకు చెందిన టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ కోట్ చేసింది. ఆ బిడ్ను గతేడాది అక్టోబర్ 8న కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత మూడు రోజులకు అంటే అక్టోబర్ 11న బిడ్డింగ్ను ధృవీకరించింది.
Omicron Variant : మనిషి చర్మంపై 21గంటలు.. ప్లాస్టిక్పై 8రోజులు జీవిస్తున్న ఒమిక్రాన్
అక్టోబర్ 25 ఒప్పందానికి సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్పై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో అప్పుడే మొదలైన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించే ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో వంద శాతం, AISATSలో 50 శాతం టాటా గ్రూప్నకు దక్కింది. ఎయిరిండియాను తిరిగి చేజిక్కుంచుకునేందుకు టాటా యాజమాన్యం సుదీర్ఘకాలం నిరీక్షించింది. 70ఏళ్ల తర్వాత ఎయిరిండియా టాటా గ్రూప్ అధీనంలోకి వెళుతోంది.
విమానయాణరంగంలో టాటా గ్రూప్ ఇప్పటికే ఎయిర్ ఏసియా ఇండియా, విస్తారా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంలో టాటా గ్రూప్ ఈ రెండు విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రస్తుతం ఎయిరిండియా మూడో విమానయాన సంస్థ కానుంది. టాటా గ్రూపు భవిష్యత్లో మిగతా రెండు విమానయాన సంస్థలను ఎయిరిండియాలో విలీనం చేసే అవకాశం ఉంది. ఎయిరిండియా నుంచి రావలసిన రూ.3,800 కోట్ల బాకీలను ఎల్ఐసీ వసూలు చేసుకుంది.
ప్రభుత్వ హామీ ఉన్న ఈ రుణాన్ని ఎల్ఐసీ మంచి లాభంతోనే విక్రయించినట్టు సమాచారం. ఎన్సీడీ రూపంలో ఉన్న ఈ రుణ పత్రాల్ని ఎల్ఐసీ నుంచి బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఐఆర్బీఏ నిబంధనల ప్రకారం ఎల్ఐసీ ప్రైవేటు ఎయిర్లైన్స్, రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు వీల్లేదు. ఎయిర్ ఇండియా ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ చేతికి మారడంతో ఎల్ఐసీ ఈ రుణ పత్రాల్ని విక్రయించింది.
ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగానే ఉన్నాయి. తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలకు ఏ మాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా సహించేంది లేదని హెచ్చరిస్తూ ఇండియన్ పైలెట్స్ గిల్డ్ (ఐపీజీ), ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ) ఎయిరిండియా సీఎండీ విక్రందేవ్ దత్కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకెళతామని హెచ్చరించాయి. అలాగే ప్రతి విమాన సర్వీసుకు ముందు విమాన సిబ్బంది బీఎంఐ తనిఖీ చేయాలన్న ఉత్తర్వులను కూడా ఉద్యోగ సంఘాలు తప్పుబట్టాయి.