Thrashed for Plucking Leaves, Dalit Man Dies by Suicide : దేశానికి పట్టిన కుల రక్కసి ఇంకా వీడడం లేదు. దళిత సమాజంపై అగ్రవర్ణాలు, అధిపత్య వర్గాలకు చెందిన వారు ఇంకా దాడులకు తెగబడుతున్నారు. అంతేగాకుండా..అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. తమ గ్రామంలో నీళ్లు తీసుకెళ్లాడని, కటింగ్ చేయనందుకు, కళ్లద్దాలు పెట్టుకున్నందుకు..ఇలా…ఏదో ఒక కారణంతో..వారిని హింసిస్తున్నారు. భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
తాజాగా..మామిడి ఆకులు తెంపాడనే కారణంతో…దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. అవమానం భరించలేక..అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ఫతేపూర్ పోలీసు సూపరింటెండెంట్ సత్పాల్ వెల్లడించారు. ఫతేపూర్ జిల్లాలో మల్వాన్ కు చెందిన ధరంపాల్ దివాకర్ గ్రామంలో ఉన్న మామిడి తోటలోకి వెళ్లాడు. అక్కడ మామిడి ఆకులను కోశాడు. ఇది చూసిన సదరు తోట యజమాని..ఇతరులు దివాకర్ పై దాడికి తెగబడ్డారు. దారుణంగా కొట్టడమే కాకుండా..అసభ్యపదజాలంతో దూషించాడని సమాచారం. నలుగురు ముందు కొట్టాడని అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లోనే ఉండిపోయాడు.
తెల్లారి చూసే సరికి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించాడని, కుటుంబసభ్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నూర్ మహ్మద్, సల్మాన్ గా నిందితులుగా గుర్తించినట్లు, దాడికి పాల్పడిన మహ్మద్ సోదరుడు ఆశిక్ ఆలీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. Malwan police station లో కేసు నమోదు చేసినట్లు, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసటి చట్టాన్ని ప్రవేశపెట్టామన్నారు.