West Bengal
TMC clarifies that CM Mamata Banerjee will not contest second place : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో చోట పోటీ చేయట్లేదని తృణముల్ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. నందిగ్రామ్లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్పై ఆ పార్టీ సమాధానం చెప్పింది. దీదీ మరో స్థానంలో పోటీ చేసే ప్రసక్తే లేదని అధికారికి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీదీ రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నే తలెత్తకూడదని, ఆమె నందిగ్రామ్లో సునాయాసంగా విజయం సాధిస్తారని టీఎంసీ ధీమా వ్యక్తం చేసింది.
కాగా.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. నిన్న రెండో దశ పోలింగ్లో నందిగ్రామ్ సహా 30 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయ్యింది. బెంగాల్ పర్యటనలో ఉన్న మోడీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, నందిగ్రామ్ వదిలి వెళ్లట్లేదన్నారు. పోలింగ్ ముగిశాక ఆమెకు తన తప్పు తెలిసొచ్చినట్లుందని, అందుకే మరో నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్నట్లు వస్తున్న వార్తలో నిజం ఉందా? అని మోడీ విమర్శించారు. దీంతో.. మోడీ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఖండిచాయి.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తత నడుమ సాగింది. పలుచోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. నందిగ్రామ్లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీఎం మమతా బెనర్జీ… అక్కడి నుంచే గవర్నర్కు ఫోన్ చేసి మాట్లాడారు. బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అల్లర్లు సృష్టిస్తూ…చట్టానికి విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించారు.