Tripura Assembly Election 2023: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. పటిష్ఠ భద్రత మధ్య కొనసాగుతున్న ఓటింగ్
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
- Harishth Thanniru
- Published On : February 16, 2023 / 07:36 AM IST
Tripura Elections2023
Tripura Assembly Election 2023: త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. ఇందుకోసం త్రిపుర వ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 1100 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా, 28 పోలింగ్ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిషేదాజ్ఞలు విధించారు. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ), సీపీఎం – కాంగ్రెస్ కూటములతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రామోథా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో ఒక స్థానం స్నేహపూర్వక పోటీ ఉంటుంది. అదేవిధంగా సీపీఐ (ఎం) 47 స్థానాల్లో పోటీ చేయగా, దానికూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తిప్రామోథ 42 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లో 20 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యధికంగా 12 మంది మహిళా అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. ఇదిలాఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద, రాష్ట్ర సరిహద్దుల్లో 31వేల పోలీస్ సిబ్బందిని, 25వేల మంది కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని నియమించినట్లు ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేశారు. నేడు ఓటింగ్ ప్రక్రియ ముగియనుండగా.. ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.
