అయోధ్యలో మసీదు.. కొత్త డిజైన్ ఇదే..!
- Sreehari A
- Published On : December 20, 2020 / 10:06 AM IST
Ayodhya Trust Design Of Mosque : వచ్చే ఏడాదిలో అయోధ్యలో మసీదు నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు విడుదల చేసింది. గత ఏడాదిలో సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలో పునాది రాయి వేసే అవకాశం ఉంది. మసీదుతో పాటు ఆస్పత్రి నిర్మాణం కూడా చేపట్టే యోచనలో ట్రస్టు ఉన్నట్టు కనిపిస్తోంది.
ముందుగా మసీదు నిర్మాణాన్ని చేపట్టి.. రెండో దశలో ఆస్పత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది. ఈ మసీదుకు ఇంకా పేరు నిర్ణయించలేదు.. చక్రవర్తి పేరుగానీ, రాజు పేరుమీద గానీ మసీదు ఉండదని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (IICF) ట్రస్టు స్పష్టం చేసింది. ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోకి తీసుకుని అయోధ్యలో మసీదు, ఆ పక్కనే ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి డిజైన్ విడుదల చేసింది.
