Jammu Airport Explosions : జమ్ము ఎయిర్ఫోర్స్ బేస్లో పేలుళ్ల కలకలం, 5 నిమిషాల వ్యవధిలో..
జమ్ము ఎయిర్పోర్టులో పేలుళ్ల కలకలం రేగింది. ఆదివారం(జూన్ 27,2021) తెల్లవారు జామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి.
- Naveen
- Published On : June 27, 2021 / 10:51 AM IST
Jammu Airport
Jammu Airport Explosions : జమ్ము ఎయిర్ పోర్టులో పేలుళ్ల కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ ఆపరేటడ్ ఏరియాలో ఆదివారం(జూన్ 27,2021) తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో ఎయిర్ ఫోర్స్ బేస్ లోని ఓ భవనం పైకప్పు దెబ్బతింది. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఎయిర్ ఫోర్స్ బేస్ చేరుకుని తనిఖీలు చేపట్టాయి. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఎయిర్ బేస్ పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఇది ఉగ్రవాదుల చర్యేనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బలగాలు కూడా ఎయిర్ఫోర్స్ బేస్ వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ బేస్ లో పేలుళ్లపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. వైస్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ముకి వెంటనే బయల్దేరారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోనున్నారు.
ఎయిర్బేస్ లో డ్రోన్లతో పేలుళ్లు చేసినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. సరిగ్గా టెక్నికల్ రూమ్ పై బాంబులు వేశారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి. ఎయిర్ ఫోర్స్ బేస్ లో నిలిపి ఉంచిన వాయుసేన విమానాలే డ్రోన్ల టార్గెట్ అని అధికారులు భావిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 1.27, 1.32 గంటలకు రెండుసార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. హెలీకాప్టర్ హ్యాంగర్కి సమీపంలో దాడి జరిగింది. ఫోరెన్సిక్ బృందాలు, నేషనల్ బాంబ్ డాటా సెంటర్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. రెండు బాంబుల్లో ఒకటి భవనం పైకప్పుపై, మరొకటి ఖాళీ స్థలంలో పడ్డట్టు గుర్తించారు.
