Uddhav Thackeray: ఈసీ నిర్ణయాన్ని సవాల్చేస్తూ సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం .. ఆ విషయంలో నో చెప్పిన న్యాయస్థానం
ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది.
- Harishth Thanniru
- Published On : February 20, 2023 / 02:55 PM IST
Uddhav Thackeray
Uddhav Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు – బాణం గుర్తును ఆ వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రకటించిన విషయం విధితమే. తాజాగా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని ఠాక్రే వర్గం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు మాత్రం అందుకు నో చెప్పింది. కేసు తక్షణ విచారణకు సీజేఐ డీవై చంద్రచూడ్ నిరాకరించారు.
Uddhav Thackeray: ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు
సరైన పేపర్ వర్క్ తో మంగళవారం అత్యవసర జాబితాలో ప్రవేశపెట్టాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపు న్యాయవాదికి కోర్టు సూచించింది. ఇదిలాఉంటే ఫిబ్రవరి 17న శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎన్నికల సంఘం నిర్ణయం తరువాత సోమవారం విధాన్ భవన్ లోని శివసేన పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం స్వాధీనం చేసుకుంది. షిండే వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు శాసనసభలోని శివసేన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకుముందు కార్యాలయం ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు నియంత్రణలో ఉండేది. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్ధవ్ ఠాక్రే బోర్డులు, బ్యానర్లను తొలగించారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి షిండే వర్గానికి చెందిన నేత భరత్ గోగావాలే మాట్లాడుతూ.. ఈ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నామని, శివసేన మా పార్టీ, ఇక నుంచి ఇతర కార్యాలయాలను మా స్వాధీనంలోకి తెచ్చుకొనేలా న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తాం అని చెప్పారు.
