Ugc Scholarship
UGC Scholarship : బాలికల అక్షరాస్యతను పెంచేందుకు, వారి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలకు యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్ అందించనుంది. దేశంలోని గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సింగిల్ గర్ల్ చైల్డ్కు ఈ స్కాలర్షిప్ అందిస్తారు. వివిధ ప్రమాణాల ప్రకారం మూడు వేల మందిని ఎంపిక చేసి, వారికి యూజీసీ ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్స్’ అందించనుంది. ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.36,200 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఇది ఆడపిల్లల ఉన్నత విద్య, సాధికారత కోసం వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు సహాయపడుతుందని యూజీసీ చెబుతోంది.
ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతం కేవలం 3వేల స్కాలర్ షిప్స్ అందించనున్నారు. ఒక్కొక్కరికీ సంవత్సరానికి రూ.36,200 చొప్పున.. రెండు సంవత్సరాలు మాత్రమే స్టైఫండ్ ఇస్తారు. పీజీ పూర్తయ్యే వరకు ఇస్తారు. కోర్సులో చేరిన సమయానికి, ఆ తర్వాత మరుసటి సంవత్సరం ప్రారంభంలో మరోసారి ఈ మొత్తం చెల్లిస్తారు.
అర్హతలు..
* పీజీ కాలేజీల్లో లేదా యూనివర్సిటీల్లో ఫస్టియర్ లో చేరబోయే వారందరూ ఈ స్కాలర్ షిప్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
* రెండో సంవత్సరం వారికి ఇది వర్తించదు.
* విద్యార్థినుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
* అడ్మిషన్ సమయానికి అంతకంటే తక్కువ వయసు ఉంటే సరిపోతుంది.
* రెగ్యులర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదవబోయే అమ్మాయిలకు అది కూడా తన తల్లిదండ్రులకు కేవలం ఒక సంతానమైన వారికే ఇది వర్తిస్తుంది. అన్న లేదా తమ్ముడు ఉన్న వారికి కూడా ఇది వర్తించదు. అయితే కవల సోదరి లేదా సోదరుడు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. డిస్టెన్స్ మోడ్లో పీజీ చేసే వారు స్కాలర్షిప్ పొందలేరు.
ఇలా అప్లయ్ చేయాలి..
* ఆసక్తి ఉన్న వారు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ (NSP) పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
* అర్హతలు ఉన్న విద్యార్థినులు మాత్రమే నవంబర్ 30, 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
* వారి ఆన్ లైన్ అప్లికేషన్ను సంబంధిత విద్యా సంస్థ వెరిఫై చేయాలి.
* తల్లిదండ్రులకు కేవలం తాను మాత్రమే సంతానమని చెప్పే అఫిడవిట్ దాఖలు చేయాలి.
* ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత మరుసటి సంవత్సరం ఇదే పోర్టల్లో రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సెమిస్టర్లో ఫెయిల్ అయిన వారికి మరుసటి సంవత్సరంలో స్కాలర్ షిప్ లభించదు.