కరోనా మహమ్మారి ఎక్కడివారక్కడే గప్ చిప్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇది దేవుళ్లకు కూడా తప్పలేదు. కరోనా కాలంలో భగవంతుడి ప్రసాదం కావాలంటే కొత్త దారులగుండా లభించనుంది. అదే ఆన్లైన్. కరోనా కష్టకాలంలో భక్తులకు కేదార్ ప్రసాదం ఆన్లైన్ ద్వారా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. సోమవారం (జులై20,2020) ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తులు www.onlineprasad.comలో రూ.451 చెల్లించి ప్రసాదం తీసుకోవచ్చు. ఆలయాన్ని సందర్శించలేని యాత్రికులకు కేదార్నాథ్ ఆశీర్వాదాలను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు.
కేదార్ నాథ్ ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు బుక్ చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే భరత్సింగ్ చౌదరి తెలిపారు. ఈ ఆలయం నుంచి ప్రసాదంతో పాటు చౌలై (స్థానిక మూలిక), ఒక రుద్రాక్ష, బిల్వ వృక్షం పత్రం, కేదారనాథుడికి సమర్పించిన ఒక పత్రం, హవన్ సామగ్రి, ఒక నాణెం, పవిత్ర భస్మం కూడా అందించనున్నారు. భక్తులు కేవలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వారి పేరు, అడ్రస్, ఈ మెయిల్, ఫోన్ నంబర్ నమోదు చేసుకొని ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని రుద్రప్రయాగ జిల్లా మేజిస్ట్రేట్ వందన సింగ్ తెలిపారు.