Uttarakhand
Uttarakhand: ఉత్తరాఖండ్లో అల్మోరా భికియాసేన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
కుమావోన్ మండల్ వికాస్ నిగమ్కు చెందిన బస్సు రాంనగర్ దిశగా వెళ్తుండగా భికియాసేన్ సమీపంలో నియంత్రణ కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా పాలన, పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పించా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. “కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ మినీ బస్సులో 18 మంది ప్రయాణిస్తున్నారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది లోయలోకి పడిపోయింది. మృతదేహాలను వెలికి తీశాం. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపించాం” అని చెప్పారు. ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు.
ALso Read: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖాలిదా జియా కన్నుమూత.. మొన్ననే బంగ్లాకు వచ్చిన ఆమె కుమారుడు
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది 1,000కు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన మలుపులు, ఇరుకైన రహదారులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షాకాలం, శీతాకాలంలో ఈ ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలనే లక్ష్యంతో ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ పాలసీ 2025కు ఆమోదం తెలిపింది.