West Bengal : వెస్ట్ బెంగాల్ లో లాక్ డౌన్ పొడిగింపు
పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
- venkaiahnaidu
- Updated on- June 14, 2021 / 06:05 PM IST
West Bengal: పశ్చిమ బెంగాల్ లో కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారం సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మేర సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను 25 శాతం సిబ్బందితో తెరిచేందుకు అనుమతించారు. ప్రైవేట్ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ 25 శాతం సిబ్బందితో పనిచేసే వెసులుబాటు కల్పించారు.
షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ లను 50 శాతం సిబ్బందితో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓపెన్ చేసేందుకు అనుమతించారు. ప్రేక్షకులు లేకుండా క్రీడా కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించారు. విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుండగా అత్యవసర సేవలు మినహా లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 50 శాతం సిబ్బందితో రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతించారు.
ఇక, వెస్ట్ బెంగాల్ లో ఆదివారం 3984 కరోనా కేసులు,84 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 14,61,257..మరణాల సంఖ్య 16,896కి చేరింది. ప్రస్తుతం బెంగాల్ లో 17,651 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.
