Adenovirus Cases: పశ్చిమ బెంగాల్లో మరో ప్రమాదకర వైరస్ విజృంభిస్తోంది. అడెనోవైరస్ ప్రభావంతో పలువురు చిన్నారులతోపాటు పెద్దలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.
చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్క రోజే 115 మంది పేషెంట్లు ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. చాలా మంది నాన్ కోవిడ్ కరోనా వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, న్యూమోకాకస్ అండ్ ఆర్ఎస్వీ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ తెలిపింది.
చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఐసీయూ/హెచ్డీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్కు వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైరస్ సోకకుండా చూడటం, త్వరగా లక్షణాలు గుర్తించడం, చికిత్స అందించడం వంటివి చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే తగిన చికిత్స అందించాలని సూచించింది. రోగులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి బెడ్ల కొరత లేదని వైద్య శాఖ తెలిపింది.
అడెనో వైరస్ సోకిన వారిని కూడా కోవిడ్ మాదిరిగానే స్వాబ్ ద్వారా పరీక్షించి, నిర్ధరిస్తారు. అడెనో వైరస్ సోకితే ప్రధానంగా కళ్లు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. తర్వాత శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులపై ప్రభావం ఉంటుంది. డయేరియా కూడా రావొచ్చు. చిన్నారులు త్వరగా, ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.