Diwali : దీపావళిరోజు ఆడపడుచులు హారతి ఇవ్వటం వెనుక అసలు కధేంటంటే?…
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇస్తారు. అనంతరం వారి దీవెనలు పొందాలని శాస్త్రం చెబుతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : November 2, 2021 / 12:03 PM IST
Harathi (1)
Diwali : భారతీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీయుజ మాసంలో కృష్ణపక్షంలో ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. లక్ష్మీదేవి పుట్టినరోజు బావించి అమ్మవారిని తమ ఇంటికి ఆహ్వానం పలుకుతారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలను ఇబ్బందులు కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు.
అదే క్రమంలో నరకుడు తన చావు మహావిష్ణువు చేతిలో కాకుండా తల్లిని అయిన చేతిలో మరణించేలా భూదేవి వరం పొందుతుంది. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. నరకుని అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు వెళతాడు. భూదేవి అంశ అయిన సత్యభామ బాణాలకు నరకుడు మరణిస్తాడు. తన పుత్రుని పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు.
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇస్తారు. అనంతరం వారి దీవెనలు పొందాలని శాస్త్రం చెబుతుంది. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం. ఈ క్రమంలోనే హారతులిచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సోదరులు వారి సోదరీమణులకు కానుకలు ఇస్తారు.
ప్రతిరోజూ మంగళప్రదంగా కొనసాగాలని ఆడపడుచుల నుంచి హారతులు అందుకొని, యథాశక్తి వారికి బహుమతులు సమర్పించడం సంప్రదాయంగా స్థిరపడింది. దీపావళి సందర్భంగా అపమృత్యుదోషం నశించడం కోసం తర్వాత అమావాస్య రాత్రి లక్ష్మీపూజ నిర్వహించాలని శాస్త్రం చెబుతుంది. అకాల మృత్యు దోషాలు తొలగి పోవడానికి నరకాధిపతి యముడి ప్రీత్యర్థం దీపదానం కూడా చేస్తారు. అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
