భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే టెక్నాలజీని బాగా వాడేస్తోంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు భారతీయ రైల్వే స్వరైల్ యాప్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
రైలు ప్రయాణికులకు సంబంధించిన అన్ని సేవలనూ ఈ యాప్ ద్వారా అందుకోవచ్చు. ఈ ఒక్క యాప్ ద్వారానే ప్రయాణికులు టికెట్లు, ఎంక్వైరీలతో పాటు పార్శిల్ బుకింగ్స్, లైవ్ ట్రైన్ స్టేటస్, టికెట్ల రద్దు, రీషెడ్యూల్, ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఇవేగాక మరిన్ని సేవలు ఒకే యాప్లో అందనున్నాయి. రైళ్లు ఆలస్యమైతే కూడా ఈ యాప్ ద్వారా అప్డేట్లు వస్తాయి.
‘స్వరైల్’ ఫీచర్లు
ఈ సేవలన్నింటినీ ఒకే యాప్ కిందకు తీసుకువస్తే ప్రయాణికులు ఇతర అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం, వారి సమయం వృథా కావడం వంటివి తగ్గుతాయి.
స్వరైల్ లాంచ్ అయ్యేలోపు ఈ యాప్ వాడవచ్చు
స్వరైల్ యాప్ అధికారికంగా లాంచ్ అయ్యేలోపు ఇప్పటికే ఉన్న ఎన్టీఈఎస్ (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) యాప్తో రైలు లేట్, రూట్ మళ్లింపులు, రైళ్ల రద్దు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎన్టీఈఎస్ యాప్ను ఎలా వాడాలి?
ఎన్టీఈఎస్ యాప్ ప్రయాణికులకు స్టేటస్ అప్డేట్లు, ట్రైన్ రద్దు, తాత్కాలిక హాల్ట్లతో పాటు రియల్-టైమ్ రైలు సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ వెర్షన్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా సమీపంలోని స్టేషన్లలో రైళ్లు రాకపోకలు, బయలుదేరే సమయాలను చూసుకోవచ్చు.