Delhi: భవిష్యత్తులో కూడా ఇలాంటి సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు
- tony bekkal
- Published On : September 5, 2023 / 04:53 PM IST
Kejriwal thanks Union Govt: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన చాలా భిన్నమైన శైలిలో కనిపించారు. కేంద్ర ప్రభుత్వం పేరు వినిపించగానే ఒంటికాలిపై లేచే ఆయన.. ఒక్కసారిగా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకు 400 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయడంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ఆశ్చర్యకర సన్నివేశం కనిపించింది.
‘‘ఈరోజు ప్రజలకు అందజేసిన 400 ఎలక్ట్రిక్ బస్సులపై రాయితీ ఇచ్చినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సబ్సిడీ పథకంలోని 921 బస్సుల్లో ఈ బస్సులు ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.417 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం రూ.3674 కోట్లు వెచ్చించనుంది. అన్ని బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇలాంటి సహాయాన్ని అందించాలి’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
దేశం మొత్తం కంటే ఢిల్లీలో ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి
ఢిల్లీ రోడ్లపై ఇప్పుడు మొత్తం 800 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలోనే అత్యధికం. 2025 చివరి నాటికి ఢిల్లీ రోడ్లపై మొత్తం 8 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈర ఆ సమయం నాటికి ఢిల్లీలో 10 వేలకు పైగా బస్సులు ఉంటాయట. వాటిలో 80% ఎలక్ట్రిక్ బస్సులే. అతి త్వరలో ఢిల్లీ కూడా అద్భుతమైన ఎలక్ట్రిక్ బస్సులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
